అనంతపురం, సెప్టెంబర్ 18: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అదే సమయంలో అన్ని కులాలు, మతాలను గౌరవించే విధానంతో పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
విజయదశమి అనంతరం వచ్చే ఏకాదశి రోజున పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త తరం యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాయలసీమ అభివృద్ధి విషయంలో గతంలో అధికారంలో ఉన్న రాజకీయ కుటుంబాలను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెంచి వలసలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు పరిస్థితిపై కూడా సంబంధిత రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను ఏర్పాటు చేయబోయే పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ప్రాధాన్యం ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. సమాజానికి మేలు చేసే యువతకు నాయకత్వ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
విద్యా రంగంలో మార్పులు తీసుకురావడంపై కూడా ఆయన పలు ప్రతిపాదనలు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఉచిత, నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తమ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఉద్యోగం లభించే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.10 వేల అలవెన్స్ అందించే విధానాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో గంజాయి సమస్యను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, ఔట్సోర్సింగ్ విధానానికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.
ఎన్నికల్లో యువతకు 66 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని, అన్ని సామాజిక వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశం కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.






